న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. సీఎం పదవి చేపట్టబోయే నేతను ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. సీఎం పదవి కోసం పోటీపడుతున్న వారిలో ముందంజలో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరూ పట్టు సడలించకపోవడంతో వ్యవహారం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి కీలక నేతలంతా చేరుకుంటున్నారు.
పార్టీ అగ్రనేత రాహులగాంధీ, ఇతర ముఖ్యనేతలు, ఇటీవల గెలిచిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది ఇప్పటికే ఖర్గే నివాసానికి చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్ మరికాసేపట్లో ఖర్గే నివాసానికి వెళ్లనున్నారు. అటు సిద్ధరామయ్య ఆదివారమే ఢిల్లీకి చేరుకుని పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరి కాసేపట్లో ఆయన కూడా ఖర్గే నివాసానికి వెళ్లే అవకాశం ఉంది.
మల్లికార్జున్ ఖర్గే తన నివాసానికి వచ్చిన నేతలందరితో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు. ఆ చర్చలో వచ్చిన అభిప్రాయాలు, సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో పార్టీ నియమించిన పరిశీలకుల కమిటీ ఇచ్చిన నివేదిను పరశీలించి సీఎం ఎవరనే విషయాన్ని ఖర్గే ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.