Suicides | దేశవ్యాప్తంగా గతేడాది అత్యధికంగా మహారాష్ట్రలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. దేశమంతా 1.64 లక్షల మంది బలవన్మరణం పాలయ్యారు. వారిలో 22 వేల మంది మహారాష్ట్ర వాసులే. తర్వాత స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర నిలిచాయి. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో 50 శాతానికి పై చిలుకు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. 2020తో పోలిస్తే 7.2 శాతం ఆత్మహత్య ఘటనలు పెరిగాయి.
2021లో దేశంలో 1,64,033 ఆత్మహత్యలు రికార్డయ్యాయి. మొత్తం బలవన్మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 (13.5 శాతం) ఘటనలు జరిగాయి. తమిళనాడులో 18,925 మంది (11.5%), మధ్యప్రదేశ్లో 14,965 మంది (9.1 %), పశ్చిమబెంగాల్లో 13,500 మంది (8.2%), కర్ణాటకలో 13,056 మంది (8.1%) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.4 శాతం ఆత్మహత్యలు జరిగాయి. మిగతా 23 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49.5 శాతం ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి.
జనాభాలో అతిపెద్ద రాష్ట్రం (16.9 శాతం) ఉత్తరప్రదేశ్లో గతేడాది కేవలం 3.6 శాతం ఆత్మహత్యలే జరిగాయి. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో 2,840 మంది ఆత్మహత్య చేసుకుంటే, పుదుచ్చేరిలో 504 మంది బలవన్మరణానికి గురయ్యారు.