పాట్నా: బీహార్లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. కల్తీ మద్యం సేవిస్తే, ప్రాణాలు కోల్పోతారని ఆయన అన్నారు. చాప్రా విషాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్య నిషేధం లేని రోజుల్లో కూడా ఇక్కడ కల్తీ మద్యం తాగి జనం చనిపోయినట్లు సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ లిక్కర్ బ్యాన్ ఉందని, కల్తీ మద్యాన్ని అమ్ముతారని, దాని వల్ల ప్రజలు చనిపోతారని, మద్యం మంచిది కాదని, ఎవరూ తాగకూడదని సీఎం నితీశ్ అన్నారు.
కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని గతంలో కొందరు డిమాండ్ చేశారని, ఎవరైనా మద్యం సేవిస్తే ప్రాణాలు కోల్పోవడం తప్పదని, మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు విషాదాన్ని మిగిల్చుతాయని, ఆ ప్రాంతాలను విజిట్ చేసి, వారికి కల్తీ మద్యం గురించి వివరించాలని సీఎం నితీశ్ తెలిపారు. పేదలను అరెస్టు చేయవద్దు అని అధికారుల్ని ఆదేశించానని, కానీ లిక్కర్ను తయారు చేసేవాళ్లను, ఆ వ్యాపారాన్ని నిర్వహించేవాళ్లను పట్టుకోవాలని ఆదేశించినట్లు సీఎం నితీశ్ తెలిపారు.
మద్య నిషేధం వల్ల చాలా మంది ప్రజలు బెనిఫిట్ పొందారని, ఎంతో మంది మద్యాన్ని త్యజించారని, ఇది మంచి పరిణామం అని, అనేక మంది మద్య నిషేధ నిర్ణయాన్ని స్వాగతించారని, కానీ కొందరు ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంటారని, అలాంటి వాళ్లను పట్టుకోమని అధికారులకు ఆదేశించినట్లు సీఎం నితీశ్ తెలిపారు.