కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది గాయపడ్డారు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి గువాహటికి వెళ్లున్న బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్ గురువారం సాయంత్రం పశ్చిమబెంగాల్ జల్పాయ్గురి జిల్లాలోని దొమోహనీ వద్ద పట్టాలు తప్పింది.
రైలులోని 12 బోగీలు పట్టాలు తప్పగా, అందులో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో రైళ్లో మొత్తం 1053 మంది ప్రయాణికులు ఉన్నారు వెల్లడించారు.
కాగా, రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందని కేంద్ర మంత్రి జాన్ బార్లా తెలిపారు. సహాయక చర్యలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రమాదంలో 36 మంది గాయపడ్డారని, వారంతా వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రయాణికులను ప్రత్యేక రైళ్లలో గువాహటి తరలించామన్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలపాలైనవారికి రూ.25 వేల చొప్పున అందిస్తామని చెప్పారు.