అలపుజా: కేరళలోని మావెలిక్కర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. రంజీత్ శ్రీనివాస్ మర్డర్ కేసులో 15 మంది దోషులకు మరణశిక్ష(Capital punishment)ను విధించింది. ఇటీవల కాలం కేరళ చరిత్రలో ఒకేసారి ఇంత మంది నిందితులకు ఏ కోర్టు కూడా మరణశిక్షను ఖరారు చేయలేదు. బీజేపీ నేత, లాయర్ రంజీత్ శ్రీనివాస్ను 2021, డిసెంబర్ 19న దారుణంగా హత్య చేశారు. ఆ మర్డర్ కేసు నిందితుల్లో నైసమ్, అజ్మల్, అనూప్, అస్లమ్, అబ్దుల్ కలామ్, సలామ్, సఫారుద్దిన్, మన్సద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నాజిర్, జాకిర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షేర్నాస్ అష్రఫ్ ఉన్నారు. ఈ నిందితులు అందరూ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)లో సభ్యత్వం కలిగి ఉన్నారు.
జడ్జి శ్రీదేవి వీజీ ఈ కేసులో తీర్పును వెలువరించారు. నిందితులకు అలపుజా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెంటల్ స్టెబులిటీ పరీక్షలు నిర్వమించాలని కోర్టు ఆదేశించింది. ఈ మర్డర్ కేసులో తొలి 8 నిందితులపై ఐపీసీలోని 302, 149, 449, 506, 341 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. వీరికి జీవిత కాల శిక్షతో పాటు మరణదండన విధించారు. అయితే తొలి 8 మంది ప్రత్యక్షంగా మర్డర్లో పాలు పంచుకున్నారు. హత్యకు గురైన బీజేపీ నేత ఇంటి ముందు ఆయుధాలతో నిఘా పెట్టిన 9 నుంచి 12వ నిందితుడి వరకు వివిధ సెక్షన్ల కింద కేసులను బుక్ చేశారు. ప్రధాన నిందితుల జాబితాలో జకీర్, షాజీ, షెర్నాస్పై ఐపీసీలోని 120బీ, 302 కింద కేసు బుక్ చేశారు.