అగర్తలా: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కర్ అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో సోమవారం విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయనను గోవింద్ వల్లభ్ పంత్ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు ఆయనను బతికించే ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం లేకపోవడంతో ఆయన మరణించినట్టు ప్రకటించారు. ‘ఆయనను మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చినప్పుడు మా వైద్యులు పరీక్షించారు.
పల్స్, రక్తపోటు, ఉష్ణోగ్రత ఇతర ప్రాణధార సంకేతాలేవీ కనిపించలేదు. వెంటనే ఎమర్జెన్సీ యూనిట్లో సీపీఆర్ చేశాం. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన మరణించినట్టు అధికారికంగా ప్రకటించాం’ అని సీనియర్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ అన్నారు. శవ పరీక్ష తర్వాతే మరణ కారణం వెల్లడించగలమని తెలిపారు. ధన్కర్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.