లక్నో: ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామాలయం గురించి ప్రస్తావన చేస్తే.. మహారాజా పటేశ్వరి ప్రసాద్ సింగ్ సాహెబ్ గుర్తు వస్తారని, బలరామ్పూర్ ప్రజలు మేధావులని, దేశానికి ఈ ప్రాంతం వాళ్లు ఇద్దరు భారత రత్నాలను ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. నానాజీ దేశ్ముఖ్తో పాటు అటల్ బిహారీ వాజ్పేయి ఈ ప్రాంతం వాళ్లే అని తెలిపారు.
డిసెంబర్ 8వ తేదీన జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన వీర సైనికుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. సీడీఎస్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ను కోల్పోవడం.. ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. రావత్ అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశ సైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందన్నారు. మిలిటరీలో ఉన్నంత కాలమే ఓ సైనికుడు కేవలం సైనికుడిలా ఉండిపోరని, వారి జీవితం అంతా యోధులుగా ఉంటారని, తన రంగానికి క్రమశిక్షణ కలిగి ఉంటారని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. జనరల్ బిపిన్ రావత్ ఎక్కడ ఉన్నా.. రాబోయే రోజుల్లో భారత్ ముందుకు వెళ్తున్న తీరును ఆయన గమినిస్తూ ఉంటారన్నారు.
దేశం యావత్తు మనోవేదనలో ఉందని, ఎంత బాధ ఉన్నా.. మన ప్రగతిని మాత్రం విస్మరించేదిలేదన్నారు. ఇండియా ఎప్పుడు ఆగదని, ప్రతిష్టంభనలో ఉండదన్నారు. కలిసికట్టుగా భారతీయులంతా పనిచేస్తారని, ప్రతి సవాల్ను ఇంటాబయటా ఎదుర్కొంటారని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని మరింత శక్తివతంగా, మరింత సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. గ్రూప్ కెప్టెన్ వరున్ సింగ్ ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, ఆయన క్షేమంగా ఉండాలని మాతా పటేశ్వరిని ప్రార్థిస్తున్నారని, దేశమంతా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనిక కుటుంబాలకు మద్దతుగా దేశం నిలుస్తోందని ప్రధాని అన్నారు.