లక్నో: ముగ్గురు చిన్నారులు.. అంతా 11, 12 ఏండ్ల వారే. రోజూలానే ఆడుకోవడానికని వెళ్లారు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. చివరికి ఊరి చివరన ఉన్న ఓ కుంటలో శవాలుగా తేలుతూ కనిపించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో చోటుచేసుకుంది.
జౌన్పూర్ సమీపంలోని జహ్రుద్దీన్కు చెందిన రంజిత్ (11), వీరు (12), సమీర్ (12) అనే ముగ్గురు స్నేహితులు. రోజూలానే నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆడుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లారు. చీకటి పడినా తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఊరి చివరన ఉన్న ఓ పొలంలోని కుంటలో తేలుతూ కనిపించారు. వారిని అందులో నుంచి వెలికితీశారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు విడిచారు. కాగా, చిన్నారులను హత్యచేసి కుంటలో పడేశారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పొలం యజమానిపై కేసు నమోదుచేయాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని లక్నో- బల్లియా జాతీయ రహదారిపై దర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
అయితే చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఏఎస్పీ సంజయ్ కుమార్ చెప్పారు.