న్యూఢిల్లీ, మార్చి 30: ఉగాది పండుగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం చల్లని వార్త చెప్పింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3% పెంచింది. డీఏ పెంపునకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పెరిగిన డీఏ గడిచిన జనవరి నెల నుంచే వర్తిస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ 34 శాతానికి పెరగనున్నది. 47.6 లక్షల ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షన్దారులు.. మొత్తంగా 1.16 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నది. కేంద్రంపై రూ.9,544 కోట్ల అదనపు భారం పడుతుంది. గతేడాది అక్టోబర్లో డీఏను 3% పెంచారు.
ఎంఎస్ఎంఈల సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన ర్యాంప్ పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చనున్నది. రూ.3,750 కోట్లు అప్పుగా ఇవ్వనున్నది. మొత్తం ఆరువేల కోట్ల రూపాయలతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మిగిలిన డబ్బును కేంద్రం సమకూరుస్తుంది. 3,887 కోట్లతో 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.