న్యూఢిల్లీ: దేశంలో నాణ్యతలేని ఔషధాలను తయారు చేస్తున్న 18 ఫార్మా కంపెనీల (Pharma Companies ) పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. భారత్లో తయారవుతున్న ఔషధాలపై ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. భారత్లో తయారైన దగ్గుమందు వల్ల గాంబియాలో చిన్నపిల్లలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. అదేవిధంగా భారత్లో తయారైన పలు ఔషధాలను అమెరికా వెనక్కు పంపింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించారు.
దేశంలోని 203 ఫార్మా కంపెనీలు ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాలను ఉత్పత్తి చేయడం లేదని ఈ తనిఖీల ద్వారా కేంద్రం గుర్తించింది. దాంతో ఆయా కంపెనీలపై దాడులకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)ను ఆదేశించింది. అయితే, 203 కంపెనీలకుగాను DCGI తొలి విడతలో 20 రాష్ట్రాల్లోని 76 కంపెనీలపై దాడులు చేసింది. అందులో 18 ఫార్మా కంపెనీలు నాణ్యతలేని ఔషధాలను తయారు చేస్తున్నట్లు తేలింది. దాంతో ఆ 18 కంపెనీల లైసెన్సులను DCGI రద్దు చేసింది.
మరో 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, దేశంలోని ఔషధ కంపెనీలపై కేంద్రం తనిఖీలకు ఆదేశించినప్పటి నుంచి ఇప్పటివరకు పలు ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోగా.. వాటిలో అత్యధికంగా హిమాచల్ప్రదేశ్ నుంచే ఉన్నాయి. హిమాచల్లో అత్యధికంగా 70 ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరాఖండ్ 45 ఫార్మా కంపెనీలు, మధ్యప్రదేశ్ 23 ఫార్మా కంపెనీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.