మీరట్: ప్రపంచ రికార్డుల కోసం కొత్తకొత్త పరిశోధనలు, ప్రయోగాలు, పరికరాలు, ఉత్పత్తులను తయారు చేయడం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. తాజాగా అలాంటిదే మరో ఉత్పత్తి సిద్ధమైంది. ఆభరణాలు తయారుచేసే ఓ జ్యుయెలరీ సంస్థ గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 26,200 వజ్రాలను పొదిగి ఒక దగదగ మెరిసే ఉంగరాన్ని రూపొందించింది. పుష్పం ఆకారంలో ఉన్న ఈ ఉంగరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు చెందిన డాజ్లింగ్ జ్యుయెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ ఏకంగా 26,200 వజ్రాలను పొదిగి ఈ ఉంగరాన్ని తయారు చేసింది. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగి రూపొందించిన ఉంగరంగా ఇది రికార్డు నెలకొల్పబోతున్నది. అత్యధిక వజ్రాలతో పువ్వు ఆకారంలో ఉన్న ఈ ఉంగరం చూపరులను ఆకట్టుకుంటున్నది.
డాజ్లింగ్ జ్యుయెలరీ సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ ఈ ఉంగరానికి ‘దేవ్ ముద్రిక’ అని పేరు పెట్టారు. ఇంతకుముందు దక్షిణాదికి చెందిన ఓ సంస్థ 24 వేల వజ్రాలను పొదిగి ఓ ఉంగరాన్ని తయారు చేసిందని విపుల్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటిదాకా అదే రికార్డుగా ఉందన్నారు. ఇప్పుడు తాము 26,200 వజ్రాలతో ఉంగరాన్ని సిద్ధం చేసి రికార్డుకు రెడీ అయ్యామని చెప్పారు.
ఈ ఉంగరం డిజైన్ను మొదట సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించామని, ఆ తర్వాత కళాకారులతో తయారు చేయించామని విపుల్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఉంగరం తయారీకి 8 నుంచి 10 మంది కళాకారులు మూడు నెలలపాటు కష్టపడ్డారని ఆయన చెప్పారు. దీన్ని రెండు వేళ్లకు పెట్టుకోవచ్చన్నారు. ఈ ఉంగరానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేశామని, రికార్డు కన్ఫమ్ అయిన తర్వాత ఉంగరం ధర నిర్ణయిస్తామని అగర్వాల్ తెలిపారు.