చెన్నై: దళిత యువకుడు, హిందూ యువతి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆ మహిళను హత్య చేశారు. (woman killed by family for marrying Dalit) గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. దళిత యువకుడి ఫిర్యాదుతో 11 మంది యువతి బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల దళిత యువకుడు నవీన్, 19 ఏళ్ల హిందూ యువతి ఐశ్వర్యకు స్కూల్ నుంచి పరిచయం ఉంది. అనంతరం వారిద్దరూ తిరుప్పూర్లో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో 18 నెలలుగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. ఐశ్వర్య కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తుందని వారు భయపడ్డారు. దీంతో కొందరు స్నేహితుల సహాయంతో డిసెంబర్ 31న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం తేని జిల్లాలోని వీరపాండికి వెళ్లారు.
కాగా, ఐశ్వర్య కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నవీన్ ఇంటి వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 2న ఆ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే జనవరి 3న ఐశ్వర్య చనిపోయినట్లు నవీన్కు తెలిసింది. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు.
మరోవైపు నవీన్ జనవరి 7న వట్టత్తికోట్టై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఐశ్వర్య, తాను ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు చూపించాడు. తన భార్యను ఆమె కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐశ్వర్య కుటుంబానికి చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.