ముంబై: బాల్యవివాహాలను నిరోధించేందుకు పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా నియమం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. బుధవారం శాసనసభలో బీజేపీ సభ్యుడు అతుల్ భత్కల్కర్ అడిగిన ప్రశ్నకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తట్కరే సమాధానమిస్తూ పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ప్రచురించే విధానం ఇప్పటికే రాజస్థాన్లో అమల్లో ఉందని, ఆ విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఆ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.
ఇటీవలి సర్వేల ప్రకారం మహారాష్ట్రలో బాల్యవివాహాల రేటు తగ్గింది. 2019-21 సర్వేలో 21.9 శాతంగా ఉన్న బాల్య వివాహాల రేటు 2023-24 సర్వే నాటికి 19.6 శాతానికి దిగివచ్చింది.