తిరువన్నమలై, జనవరి 30: తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో 80 ఏండ్ల తర్వాత ఓ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించారు. తండరమ్పట్టు గ్రామంలో ముత్తు మరియమ్మన్ అనే 200 ఏండ్ల నాటి పురాతన ఆలయం ఉంది. ఎండోమెంట్ బోర్డు ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో 12 రోజుల పాటు పొంగల్ వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి.
అయితే, ఈ ఆలయంలోకి గ్రామంలోని 500 కుటుంబాలకు 8 దశాబ్దాల నుంచి ప్రవేశం లేదు. ఈ ఏడాది దళిత కుటుంబాలకు చెందిన ప్రతినిధులు తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని గ్రామ పెద్దలను కోరారు. వారు నిరాకరించడంతో ఎండోమెంట్ అధికారులను సంప్రదించారు.
విచారణ జరిపిన ఉన్నతాధికారులు దళితులను గుడిలోకి అనుమతించాలని నిర్ణయించారు. దీన్ని కొందరు గ్రామ పెద్దలు వ్యతిరేకించారు. ఆలయాన్ని మూసేయాలని ధర్నాకు దిగారు. చివరకు పోలీసుల సహాయంతో అధికారులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. 300 మంది దళితులు (పెద్దలు, పిల్లలు) ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, పరవశించిపోయారు. కలెక్టర్ పీ మురుగేశ్, ఎస్పీ డాక్టర్ కార్తికేయన్కు కృతజ్ఞతలు తెలిపారు.