జైపూర్ : చేసిన పనికి డబ్బు అడిగినందుకు ఓ దళిత ఎలక్ట్రీషియన్ను తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కలకలం రేగింది. నిందితుల్లో ఒకరు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తనపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై బాధితుడు భరత్ కుమార్ (38) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమార్ ఎలక్ట్రిక్ పనులు చేసినందుకు రూ.21,000 బిల్లు కాగా నిందితులు రూ .5000 చెల్లించారు. మిగిలిన మొత్తం ఇవ్వాలని కోరేందుకు కుమార్ దాబాకు వెళ్లగా అక్కడ వేచిఉండాలని కోరిన నిందితులు ఎంతసేపటికీ డబ్బులు చెల్లించలేదు.
దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమార్ హెచ్చరించగా నిందితులు అతడిని నిర్భందించి కిందపడేసి దారుణంగా కొట్టారు. కుమార్ను కొడుతుండగా ఓ నిందితుడు అతడి మెడలో చెప్పుల దండ వేసి వీడియోలో రికార్డు చేశాడు. ఐదు గంటల పాటు కుమార్ను నిందితులు తీవ్రంగా హింసించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.