పిలిభిత్, సెప్టెంబర్ 11: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. పిలిభిత్ జిల్లాలోని మాధవ్ తండాలో ఈ నెల 7న ఈ దారుణం చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులు అనంతరం చంపేయాలనే ఉద్దేశంతో డీజిల్ పోసి నిప్పంటించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు వాంగ్మూలం ఇస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. యూపీ ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.