బెంగళూరు: పబ్లిక్ ప్లేస్లో కలిసి కూర్చొన్నందుకు దళిత యువకుడు, ముస్లిం యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. (Dalit boy, Muslim woman thrashed) అంతేగాక వారిని ఒక గదిలో నిర్బంధించి ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్లతో కొట్టారు. మొబైల్స్ ఫోన్స్తోపాటు వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల దళిత యువకుడు సచిన్ లమాని, 22 ఏళ్ల ముస్లిం యువతి ముస్కాన్ పటేల్ శనివారం సీఎం యువ నిధి పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. భోజన విరామ సమయం కావడంతో ఆ తర్వాత రావాలని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో వారిద్దరూ బెళగావిలోని కిల్లా సరస్సు వద్దకు చేరుకుని అక్కడ కూర్చొన్నారు.
కాగా, కొందరు ఆకతాయిలు సచిన్, ముస్కాన్ వద్దకు వచ్చారు. ఆ మహిళ తన బంధువని సచిన్ చెప్పగా ఇద్దరి పేర్లు అడిగారు. ముస్లిం మహిళతో కలిసి ఉన్న అతడ్ని కొట్టారు. ఆమెతో కలిసి ఎందుకు ఉన్నావంటూ సచిన్ను ప్రశ్నించి వేధించారు. ఇంతలో మరో 13 మంది అక్కడకు చేరుకున్నారు. వారిద్దరిని ఒక చొటకు తీసుకెళ్లి గదిలో నిర్బంధించారు. తిట్టడంతోపాటు ప్లాస్టిక్ పైపులు, ఐరన్ రాడ్లతో సచిన్ను కొట్టారు. అతడి గొంతు నొక్కారు. ముస్కాన్పై కూడా దాడి చేశారు. బలవంతంగా మొబైల్ ఫోన్స్, వారి వద్ద ఉన్న రూ.7,000 నగదు లాక్కున్నారు. శనివారం సాయంత్రం వరకు వారిద్దరిని వేధించారు. ఆ తర్వాత బెదిరించి వారిని విడిచిపెట్టారు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత సచిన్, ముస్కాన్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆగంతకులు తమను కొట్టి హింసించడంపై ఫిర్యాదు చేశారు. తమ మొబైల్స్తోపాటు డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.