న్యూఢిల్లీ, హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా, కిరణ్ రిజిజు, మాజీ సీజేఐ యూయూ లలిత్ పాల్గొన్నారు. అయితే, సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవటంపై న్యాయవర్గాల్లో చర్చ మొదలైంది. ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని చర్చించుకొంటున్నారు. కరోనా విజృంభించినప్పుడు కూడా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారానికి హాజరైన మోదీ.. ఇప్పుడెందుకు రాలేదని మాట్లాడుకొంటున్నారు. జస్టిస్ చంద్రచూడ్ సీజేఐ కావటం బీజేపీకి ఇష్టం లేదన్న వార్తలకు బలం చేకూరుతున్నదని పేర్కొంటున్నారు.
సీజేఐగా చంద్రచూడ్ పేరును సుప్రీం కోర్టు కొలీజియం రాత్రికి రాత్రే సిఫారసు చేసింది కాదు కదా అని చెప్తున్నారు. సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమం కంటే హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? అని అంటున్నారు. గతంలో గవర్నర్ తమిళిసై బాహాటంగా విమర్శలు ఎకుపెట్టినా సీఎం కేసీఆర్ రాజ్భవన్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ న్యాయకోవిదుడు. అత్యంత నిష్ణాతుడు. చరిత్రను మలుపుతిప్పే కీలక తీర్పులిచ్చిన పలు బెంచ్ల్లో ఆయన భాగస్వామి. కానీ, ఆయన సీజేఐ కారాదని ‘కొందరు’ సుప్రీం కోర్టుకు వచ్చారంటే.., సుప్రీంకోర్టు ద్వారానే ఆయనను అడ్డుకోవాలన్న ప్రయత్నాలు చేయటం అసాధారణ విషయమని పేర్కొంటున్నాయి. ఆది నుంచీ జస్టిస్ చంద్రచూడ్ సీజేఐ కావడం బీజేపీకి ఇష్టం లేదనే వాదనలు ఉన్నాయని అంటున్నారు. సీజేఐగా ఆయనను నియమించటం ఇష్టం లేక మాజీ సీజేఐ లలిత్ పదవీకాలాన్ని పొడగిస్తారనీ న్యాయ, పాత్రికేయ వర్గాల్లో చర్చ జరిగింది.
నిఖార్సైన న్యాయమూర్తి
నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మారు పేరుగా జస్టిస్ చంద్రచూడ్ వ్యవహారశైలి ఉంటుందని ఆయన తీర్పులే చెప్తాయి. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ సీజేఐగా వ్యభిచారం, వ్యక్తిగత గోప్యతపై వెలువరించిన తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్ రద్దు చేయడాన్ని న్యాయ నిపుణులు ఉదహరిస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియంలోనూ జస్టిస్ చంద్రచూడ్ నిఖార్సుగా వ్యవహరించారు. ఇటీవల 11 మంది పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సూత్రప్రాయంగా తెలిపి, ఒకరి పేరును మాత్రమే ఆమోదించింది. మిగిలిన పది పేర్లపై నిర్ణయం తీసుకొనేందుకు నాటి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని కొలీజియం సమావేశానికి జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. లిఖితపూర్వకంగా అభిప్రాయం చెప్పాలని కోరినా జస్టిస్ చంద్రచూడ్ తిరసరించడాన్ని ఆయన ముక్కుసూటితనానికి నిదర్శనంగా న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తండ్రి చెప్పిన వ్యభిచారం, వ్యక్తిగత స్వేచ్ఛపై తీర్పులను తిరగరాశారని, 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాక 734 తీర్పులను వెలువరిస్తే అందులో ఏకంగా 520 జడ్జిమెంట్లను జస్టిస్ చంద్రచూడ్ రాశారని గుర్తుచేస్తున్నారు.
న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ
2024 నవంబర్ 10 వరకు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ కొనసాగుతారు. రాజకీయం కోణంలో చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికలయ్యే వరకు ఆయనే సీజేఐగా ఉంటారు. ఇప్పుడు ఆయన ముందు బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టోరల్ బాండ్ సీం వంటి కేసులున్నాయి. న్యాయపరమైన విషయాలపై ముకుసూటిగా చట్టప్రకారం అడుగులు వేసే జస్టిస్ చంద్రచూడ్ వైఖరి మింగుడుపడకే మోదీ ముఖం చాటేశారని న్యాయవర్గాలు చెప్తున్నాయి. సీజేఐ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోతున్నట్టుగా రాష్ట్రపతికి ప్రధాని మోదీ ముందే సమాచారం ఇచ్చారని అధికార వర్గాలు అంటున్నా.. దేశ న్యాయ చరిత్రలో సీజేఐ ప్రమాణానికి ప్రధాని హాజరుకాకపోవడం ఇదే తొలిసారని న్యాయవర్గాలు చెప్తున్నాయి.
మాటలతో కాదు చేతల్లో చూపిస్తా: సీజేఐ చంద్రచూడ్
దేశ పౌరులకు సేవ చేయటమే తన ప్రధాన కర్తవ్యమని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడ మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల సామాన్యుల కోసం పనిచేస్తానని వెల్లడించారు. టెక్నాలజీ, రిజిస్ట్రీ, న్యాయసంబంధ అంశాలు అన్న తేడాలేకుండా అన్నింటిలో ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతానని అన్నారు. ఈ పదవి తనకు దక్కిన గొప్ప అవకాశం, బాధ్యత అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొంటారని అడగ్గా.. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని బదులిచ్చారు.
సీజేఐ ప్రమాణానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవటం కచ్చితంగా అహంకారమే. ఇది భారత రాజ్యాంగాన్ని, భారత సంస్కారాన్ని అగౌరవపర్చడమే. గైర్హాజరుపై మోదీ వివరణ ఇవ్వాలి లేకపోతే క్షమాపణ చెప్పాలి.
– సుబ్రమణ్య స్వామి, బీజేపీ సీనియర్ నేత