న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఆప్తుడు గౌతం అదానీ సోదరుడు.. వినోద్ అదానీ సైప్రస్లో పలు ఆఫ్షోర్ కంపెనీలు నడుపుతున్నాడని, 66 మంది భారతీయ వ్యాపారవేత్తలకు సైప్రస్ ‘గోల్డెన్ పాస్పోర్ట్’ లభించిందని ఆంగ్ల దినపత్రిక తాజాగా వార్తా కథనం వెలువరించింది. 2007లో సైప్రస్ ప్రభుత్వం ‘గోల్డెన్ పాస్పోర్ట్ పథకం’ తీసుకొచ్చింది. ఆ దేశ పౌరసత్వం పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. భారత్లోని ఆర్థిక నేరగాళ్లు, పన్ను ఎగవేతదార్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించింది. ఈ పథకం ద్వారా ‘గోల్డెన్ పాస్పోర్ట్’ పొందినవారిలో.. వినోద్ అదానీ, పారిశ్రామికవేత్త పంకజ్ ఒస్వాల్, ఆయన భార్య రాధికా ఒస్వాల్, క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న యూపీ వ్యాపారవేత్త విర్కారన్ అవస్తీ, ఎంజీఎం మారన్, సురేంద్ర హిరానీ.. తదితరులు ఉన్నట్టు వార్తా కథనం పేర్కొన్నది. వినోద్ అదానీ విదేశాల్లో ఆఫ్షోర్ కంపెనీలు నడుపుతున్నాడని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించగా, అదానీ కంపెనీ ఆ ఆరోపణల్ని ఖండించింది. తాజా కథనంతో హిండెన్బర్గ్ ఆరోపణలు నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
విదేశాలకు తరలిన ప్రజల సొమ్ము: రాహుల్గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ స్పందిస్తూ, ‘వినోద్ అదానీ సహా 66 మంది భారతీయ వ్యాపారవేత్తలు భారత్ నుంచి సైప్రస్కు తమ పెట్టుబడుల్ని తరలించారు. ప్రజల సొమ్మును దొంగలించడానికి వారికి దొరికిన బంగారంలాంటి పథకం ఇది’ అని అన్నారు. ప్రజల సొమ్ము షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలింది’ అని ఎక్స్లో సందేశాన్ని పోస్ట్ చేశారు.