న్యూఢిల్లీ, మే 23: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతున్నదని, ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 26-27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, దక్షిణ మణిపూర్ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానును ‘రెమల్’ అని పిలుస్తున్నారు. ‘మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్గా మారుతుంది. ఇది మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారుతుంది’ అని ఐఎండీ తెలిపింది. తుఫాన్ కారణంగా తీర ప్రాంతంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండీ సైంటిస్టు మోనికశర్మ చెప్పారు. మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని, సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి తీరప్రాంతానికి చేరుకోవాలని మత్స్యకారులకు సూచించారు.