చెన్నై, డిసెంబర్ 9: ‘మాండస్’ తుఫాను తమిళనాడును వణికిస్తున్నది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తుఫాన్ తీరందాటే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. తుఫాను ప్రభావంతో శుక్రవారం తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కొద్దిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. మాండస్ నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్టు అధికారులు 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తీరప్రాంతం వెంట ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, కాలకురిచ్చి, వేలూరు, రాణిపేట్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు.