హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. తుఫాను ‘అసని’గా రూపాంతరం చెందిందని భారత వాతావారణ విభాగం వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తూర్పు తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్నదని అధికారులు తెలిపారు. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫాను గా మారుతుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రంనాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరగా చేరుకుంటుందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరించారు. ఈ తుఫాను ఒడిశా, ఏపీ కోస్తా ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, అయితే ఆ తీరానికి సమాంతరంగా ఉత్తరానికి పయనిస్తుందని చెప్పారు.
మూడు రాష్ర్టాలకు భారీ వర్ష సూచన
అసని తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది. ఆదివారం సాయంత్రానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు.. సోమవారం నాటికి 105 నుంచి 115 కిలోమీటర్ల వేగానికి పుంజుకుంటాయని పేర్కొంది. మే 10 నాటికి వేగం తగ్గి 96 నుంచి 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అదే రోజు తుఫాను బలహీన పడుతుందని, అయితే తిరిగి మే 11, 12వ తేదీల్లో బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడుతుందని వెల్లడించింది.
తెలంగాణలో తేలికపాటి వర్షాలు
అసని తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా 12వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఆదివారం సాయంత్రం 18 జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలిక పాటి వర్షం కురిసినట్లు పేర్కొన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో అత్యధికంగా 2.38 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా ఎంకూరు, మధిరలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే ఎండల తీవ్రత కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 42.9 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
అసని అంటే కోపం
బంగాళాఖాతంలో సంభవించే తుఫానులకు ఆ తుఫానులతో ప్రభావితమయ్యే ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు వంతుల వారీగా పేర్లను పెడతాయి. నిజానికి ముందుగానే కొన్ని పేర్లను ఎంపిక చేస్తాయి. తుఫాను సంభవించినప్పుడల్లా ఆ జాబితా నుంచి తుఫానుకు నామకరణం చేస్తాయి. ప్రస్తుత తుఫానుకు అసని అని శ్రీలంక పేరు పెట్టింది. అసని అంటే సింహళ భాషలో కోపం అని అర్థం.