హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): మనం వాడే స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే మనల్ని ఏమార్చి కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిచోటా మాటు వేసి ఉంటున్నారు. వీరు చేసే మోసాల గురించి అవగాహన కలిగి ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే వారికి అడ్డుకట్ట వేయగలమని రిజర్వు బ్యాంక్ అధికారులు అంటున్నారు. పాస్వర్డ్లు బలంగా పెట్టుకోకపోయినా, వారి మాయమాటలకు పడిపోయినా ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. మన అలసత్వం, అమయాకత్వాన్నే ఆసరాగా చేసుకొని కూర్చున్నచోటి నుంచే కోట్ల రూపాయలు కొల్లగొడుగున్నారు సైబర్ నేరగాళ్లు. వీరి బారి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు సూచిస్తూ ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది.
మనం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇందుకోసం ‘https:// cybercrime.gov.in’ లో ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా 24 గంటలపాటు పనిచేసే సైబర్క్రైం హెల్ప్లైన్ నంబర్ 155260కు ఫిర్యాదు చేయవచ్చు. మన తెలుగు రాష్ర్టాలతో సహా ఇతర రాష్ర్టాల్లోనూ ఈ హెల్ప్లైన్ సేవలు ఉంటాయి. మనం కాల్ చేసిన వెంటనే పోలీసులు మన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేస్తారు. దీనివల్ల మరింత సొమ్ము మనఖాతా నుంచి పోకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కేసు దర్యాప్తు ఉంటుంది.
పాస్వర్డ్ పక్కాగా ఉండేలా చూసుకోవాలి..
మీ పాస్వర్డ్ మీ ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, సోషల్ మీడియా ఖాతాలకు తాళం వంటిది. ఇది పక్కాగా ఉండేలా చూసుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి చోటా టూ ఫ్యాక్టర్(రెండంచెల సెక్యూరిటీ) ఆథంటికేషన్ పెట్టుకోవాలి.