Supreme Court : సైబర్ నేరగాళ్లు (Cyber criminals) అమాయక ప్రజల సంపదను దోచుకునే ‘పరాన్నజీవులు (Parasites)’ అని, వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్ (Justice Surykant), జస్టిస్ వీ మోహన (Justice V Mohana) లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కలిపి విచారించాలని కోరుతూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
ఈ అంశంపై సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. ‘మీలాంటి వారు పరాన్నజీవులు. అమాయక మదుపరుల నుంచి సొమ్ము వసూలు చేసి వారిని వంచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో తాము అత్యంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ తరహా నేరగాళ్లు తమిళనాడు నుంచి జమ్మూకశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తంచేసింది.
ఇలాంటి నేరస్థులను జైల్లోనే ఉంచడం సామాజిక ప్రయోజనాలకు శ్రేయస్కరమని ధర్మాసనం పేర్కొన్నది. దేశంలో ‘డిజిటల్ అరెస్ట్’ వంటి స్కామ్లతో సహా ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మోసాల ధాటికి వృద్ధులు, సామాన్యులు కోట్ల రూపాయల మేర నష్టపోతున్నారని, అటువంటి వారిని కట్టడి చేసేందుకు కఠినమైన న్యాయపరమైన వైఖరి అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.