రాంచీ: సైబర్ నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్లో భాగంగా అణువణువు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ నదీ తీరంలో ఆరుగురు అనుమానితులు తారసపడ్డారు. వారిని సైబర్ చీటర్స్గా గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా పరుగందుకున్నారు. పోలీసులు వెంబడించగా నదిలో దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. జార్ఖండ్ రాష్ట్రంలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. జార్ఖండ్లో కూడా తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో సైబర్ ఛీటర్స్ను పట్టుకునేందుకు జార్ఖండ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. యూనిఫామ్లో కాకుండా సాధారణ దుస్తులు ధరించి పలు ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే బరాకర్ నది తీరంలో గాలిస్తుండగా ఆరుగురు అనుమానితులు తారసపడ్డారు. వాళ్లను సైబర్ నేరగాళ్లుగా ధృవీకరించుకుని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా నదిలో దూకేశారు. దాంతో పోలీసులు కూడా నదిలో దూకి, వెంబడించి, చివరికి నది అవతల నిందితులను అరెస్టు చేశారు.
కాగా, ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8 లక్షలకుపైగా నగదు, 12 మొబైల్ ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్ కార్డులు, 12 పాస్ పుస్తకాలు, కొన్ని పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు పలువురికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా గర్భిణిలను లక్ష్యంగా చేసుకుని న్యూట్రిషన్ ట్రాకర్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు.