న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పిల్లలకు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అయితే ఆ కేసును విచారించనున్నట్లు కేంద్రం పరిధిలోని యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ పేర్కొన్నది. తమ పిల్లల ఇన్స్టా అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఇటీవల ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వానికి ఏం పనిలేదా.. మా పిల్లల అకౌంట్లు ఎందుకు హ్యాక్ చేస్తున్నారని ఆమె అడిగారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఇటీవల సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దానిపై ప్రశ్నించిన సమయంలో.. ప్రియాంకా తన పిల్లల ఇన్స్టా అకౌంట్ హ్యాకింగ్ గురించి తెలిపారు. ప్రభుత్వానికి పనులు లేవా.. విపక్షాల ఫోన్లను ట్యాప్ చేయడమేనా వాళ్ల పని, ప్రజల కోసం వాళ్లు పనిచేయరా అని ప్రియాంకా నిలదీశారు. తమ పిల్లల ఇన్స్టా అకౌంట్ల హ్యాక్ అయినట్లు ప్రియాంకా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆ అంశాన్ని దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా సీఈఆర్టీ.. ఇన్స్టా అకౌంట్ల హ్యాక్ అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా వెల్లడైంది. సీఈఆర్టీ-ఇన్ ఓ అడ్వాన్స్డ్ ల్యాబ్ను నడిపిస్తుంది. హ్యాకర్లను ఆ ల్యాబ్ ట్రేస్ చేస్తుంది. సైబర్ దాడుల్ని కూడా అది అడ్డుకుంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ దాడులు చేస్తున్నట్లు ప్రియాంకా ఆరోపించారు. ప్రియాంకా గాంధీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె మిరయా వద్రాకు 18 ఏళ్లు కాగా, కుమారుడు రైహన్ వద్రా వయసు 20 ఏళ్లు.