ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో.. ఆదివారం కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి (సీడబ్ల్యూసీ) భేటీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో పార్టీ పేలవ ప్రదర్శన, నూతన అధ్యక్షుడి ఎంపిక విషయాలపైనే ప్రముఖంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్కు గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. గోవాపై గంపెడన్ని ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. ఆ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఇక అధికారంలో వున్న పంజాబ్నూ కోల్పోయింది. ఆప్ అఖండ విజయం సాధించింది. యూపీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కాలికి బలపం కట్టుకొని తిరిగినా…. ఘోర పరాభవం ఎదురైంది. మరోవైపు జీ 23 నేతలు కూడా ఫలితాలపై తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఓటమికి బాధ్యులెవరో తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ భేటీని కూడా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.