IIIT Bangalore | బెంగళూరు, మార్చి 31: తరగతి గదిలో చెప్పే పాఠ్యాంశాలను అంధ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చేసే కొత్త సాంకేతికతను ట్రిపుల్ఐటీ బెంగళూరుకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధ్యాపకులు బోర్డుపై వివరించే అంశాలు అంధ విద్యార్థులకు చేతి వేళ్లపై అర్థమవుతాయి. ఇందుకోసం ఒక చిన్న పరికరాన్ని చేతి వేలికి పెట్టుకోవాలి. తరగతి గదిలో సాధారణ బోర్డు కాకుండా స్మార్ట్ బోర్డు ఉండాలి.
వైఫై ద్వారా బోర్డుకు, విద్యార్థి చేతివేలికి ఉండే పరికరం అనుసంధానమై పని చేస్తుంది. అధ్యాపకులు బోర్డుపై రాసిన వాటిని చేతివేలికి ఉన్న పరికరం విద్యార్థితో డెస్కుపై రాయిస్తుంది. కంప్యూటర్ మౌస్ను వినియోగించేటప్పుడు చేతివేళ్లు ఎలా కదులుతాయో ఈ పరికరం ద్వారా కూడా అలానే కదులుతాయి. ఇందులో బ్రెయిలీ సెన్సార్ కూడా ఉంటుంది కాబట్టి అంధ విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. దీని ధర కూడా తక్కువేనని ట్రిపుల్ఐటీ బెంగళూరు అసోసియేట్ ప్రొఫెసర్ మాధవ్రావు తెలిపారు. త్వరలోనే ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.