హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరగకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన బీఆర్కేభవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజీ యూనిట్లు, పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ ఎడ్సార్ప్షన్) ప్లాంట్ల నిర్మాణం, క్రయోజనిక్ ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, సీఎస్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే చర్యలు ప్రారంభించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు.
కొవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల్లను 48 ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుచేసి, భవిష్యత్లో కూడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత రాకుండా అవసరమైన పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం, ఇతర సామగ్రి తదితర అంశాలకు సంబంధించిన చర్యలు వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్రాస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, మెగా ఇంజినీరింగ్ ప్రతినిధులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ వ్యాధికి గాంధీ, కింగ్కోటిలోని ఈఎన్టీ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆయుష్ దవాఖానలో బ్లాక్ ఫంగస్కు చికిత్స అందిచాలని సంబంధిత వైద్యులకు సూచించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు సీఎస్ మంగళవారం బీఆర్కేభవన్లో ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య పద్ధతుల్లో లభించే చికిత్స విధానాల గురించి ఆయుష్ వైద్యులు సీఎస్కు వివరించారు.
బ్లాక్ ఫంగస్కు ఎర్రగడ్డ ఆయుర్వేద, రామంతాపూర్ హోమియోపతి, చార్మినార్, ఎర్రగడ్డల్లోని యునానీ దవాఖానల్లో చికిత్స అందించనున్నట్టు సీఎస్కు వైద్యులు తెలిపారు. దీంతో ఆయుష్ దవాఖానల్లో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు, మీడియా సమావేశాల ద్వారా బాధితులకు అవగాహన కల్పించాలని సీఎస్ ఆయుష్ వైద్యులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, తెలంగాణ అడిషనల్ సీఈవో డాక్టర్ బుద్ధ ప్రకాశ్ ఎం జ్యోతి, ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి, ఆరోగ్యశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ గంగాధర్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్బాబు, హోమియోపతి డాక్టర్లు లింగా రాజు, పీ నవీన్, ప్రొఫెసర్ కే రజనీ చందర్, ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్రెడ్డి, ఆయుర్వేద డాక్టర్లు సురేశ్ జఖోటియా, ప్రవీణ్కుమార్, శైలేష్నాథ్ సక్సేనా, యునానీ డాక్టర్లు ప్రొఫెసర్ బొఖారీ, ప్రొఫెసర్ సలావుద్దీన్, ఎంహెచ్ కజ్మి, మిన్హాజుద్దీన్ పాల్గొన్నారు.