శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) హతమార్చింది. మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నది. జమ్ముకశ్మీర్తోపాటు ఇతర చోట్ల కార్యకలాపాల గురించి సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం మీడియాకు వివరించారు. 2021 మార్చి 1 నుంచి 2020 మార్చి 16 వరకు జమ్ముకశ్మీర్లో 175 మంది ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్ మట్టుబెట్టిందని తెలిపారు. అదే సమయంలో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో 19 మంది మావోయిస్టులను సీఆర్పీఎఫ్ హతమార్చడంతోపాటు 699 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్లో పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాళ్లు విసిరే సంఘటనలు చాలా వరకు లేవన్నారు. అలాగే విదేశీ ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు కూడా తగ్గాయని వివరించారు.
కాగా, పలు రకాల సెక్యూరిటీ కవర్ కింద సుమారు 117 మందికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తున్నదని డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. వీఐపీ సెక్యూరిటీ వింగ్లో 32 మంది మహిళా సిబ్బందిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 41 మంది వీఐపీల భద్రతను సీఆర్పీఎఫ్ పర్యవేక్షించిందని అన్నారు. ఎన్నికల అనంతరం 27 మంది వ్యక్తులకు భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడించారు.
మరోవైపు విధి నిర్వహణలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బందికి రిస్క్ ఫండ్ నుంచి అందించే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచినట్లు డీజీ కుల్దీప్ సింగ్ వివరించారు. ఇతర కేసుల్లో ఎక్స్గ్రేషియాను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. 2022లో ఇప్పటి వరకు 10 మంది సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మానసిక ఒత్తిడిని పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సిబ్బంది తమ సమస్యలను చెప్పుకునేందుకు ‘చౌపల్’ నిర్వహించడంతోపాటు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
కాగా, శనివారం జమ్మూలోని ఎంఏ స్టేడియంలో సీఆర్పీఎఫ్ 83వ రైజింగ్ డే పరేడ్ను నిర్వహించనున్నారు. ఈ వేడుకను ఢిల్లీ-ఎన్సీఆర్ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి.