రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం విశేషం. సుక్మా (Sukma) జిల్లాలోని తొండమార్క ప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు మావోయిస్టులు మందుపాతర (IED blast) పేల్చారు. దీంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్కు (Cobra Battalion) చెందిన శ్రీకాంత్ తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఛవాన్ తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను హెలికాప్టరులో దవాఖానకు తరలించామన్నారు. మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడటం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. సోమవారం కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఐఈడీ పేలుడులో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులు గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్లో తొలివిడుతలో భాగంగా మావోయిస్టు ప్రభావితం ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో 12 నియోజకవర్గాలు బస్తర్ డివిజన్లోనే ఉన్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని మిగిలిన 70 స్థానాల్లో ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటిస్తారు.