న్యూఢిల్లీ, జూలై 2: సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ మోదీ పరివారానికి కునుకు లేకుండా చేసిన అన్నదాతలు మరో మహా సంగ్రామానికి సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిన్నర పాటు నిరసనలు చేపట్టిన రైతన్నలు.. కేంద్రం మెడలు వంచారు. అన్నదాతల ఆగ్రహజ్వాలకు వణికిన బీజేపీ సర్కారు.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు గత నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతుల మిగతా డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం, పంట వ్యర్థాలను కాల్చే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవడం తదితర డిమాండ్లు ఉన్నాయి. అయితే 7 నెలలు గడిచినా ప్రధాని, ఆయన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీంతో మరో నిరసనోద్యమానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు.
అవసరమైతే మరో ఉద్యమం
డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఘజియాబాద్లో రైతు నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాకేశ్ టికాయిత్ వంటి ప్రముఖుల నేతృత్వంలో ఈ భేటీ జరుగనున్నది. డిమాండ్ల పరిష్కారానికి అవలంబించాల్సిన మార్గాలనూ చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేనికైనా సిద్ధం
హక్కుల సాధనకు దేనికైనా మేము సిద్ధం. సమయం, ప్రాంతం ఏంటో మా నాయకులు చెప్తే చాలు.. నిరసనల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం.
-బచిత్తర్ కౌర్, మహిళా రైతు