న్యూఢిల్లీ : జీతాల పెంపు కోరుతూ పైలట్లు సమ్మెకు దిగడంతో జర్మన్ విమానాయాన సంస్ధ లుఫ్తాన్సా విమానాలను రద్దు చేసింది. లుఫ్తాన్సా నిర్ణయంతో తమ విమాన చార్జీలను రిఫండ్ చేయాలని కోరుతూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకులు నిరసనలు చేపట్టారు. నిరసనకు దిగిన ప్రయాణీకులకు ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
ఎయిర్లైన్ కంపెనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతుందని అధికారులు వారికి హామీ ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫ్రాంక్ఫర్ట్, మునిచ్ వెళ్లాల్సిన ప్రయాణీకులు చెకింగ్ ఇన్ ఏరియా వెలుపలి ఎగ్జిట్ గేట్లు వద్ద ధర్నా చేపట్టారు.
కాగా పైలట్ల సమాఖ్య ఒక రోజు సమ్మెకు దిగడంతో శుక్రవారం 800 విమానాలను రద్దు చేసినట్టు దీంతో 1,30,000 మంది ప్రయాణీకులపై ప్రభావం పడుతుందని లుఫ్తాన్సా పేర్కొంది. ప్రయాణీకులతో పాటు కార్గో సేవలపైనా పైలట్ల సమ్మె ప్రభావం పడింది.