న్యూఢిల్లీ, ఔరంగాబాద్, జూన్ 1: న్యాయం కోసం అయిదు నెలలుగా రెజ్లర్లు చేస్తున్న పోరాటంపై కేంద్రం వ్యవహార శైలి కమలం పార్టీలో కలవరానికి, కుస్తీకి కారణమైంది. రెజ్లర్లు చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని, కేంద్రం త్వరితగతిన ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హర్యానా బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రెజర్లకు న్యాయం జరుగుతుందని పార్టీ మహిళా ఎంపీలు ప్రీతం ముండే, మేనకా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు వాస్తవాలు విచారించాలి కదా అని ప్రశ్నించారు. అంటే పరోక్షంగా తమ పార్టీ నేతృత్వంలోని కేంద్రం వ్యవహార శైలి తప్పని విమర్శించారు. ఇంకోవైపు చూస్తే రెజ్లర్ల డిమాండ్లపై మీడియాకు బదులివ్వడానికి కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి వంటివారు భయపడి పరుగులు పెడుతున్నారు. క్రీడల శాఖ మంత్రి అనురాగ్ అయితే విచారణ జరిగే వరకూ వేచి చూద్దామని తప్పించుకు తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే కుస్తీ వీరుల పోరాటంపై బీజేపీ నిరక్ష్య వైఖరి ఆ పార్టీలో ముసలం పుట్టించి
గొడవలు సృష్టించేలా ఉంది!
హర్యానాకు చెందిన అగ్ర శ్రేణి కుస్తీ వీరులు చేస్తున్న డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని ఆ రాష్ట్ర బీజేపీ నేతలూ అంగీకరిస్తున్నారు. కానీ ఈ విషయంలో అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేయడం తప్ప ఒత్తిడి తెచ్చేందుకు వారు ప్రయత్నించడం లేదు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెజ్లర్ల ధర్నా పార్టీ విజయావకాశాలను భారీగా దెబ్బ తీయొచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. ‘వారి బాధను, నిస్సహాయతను నేను అనుభూతి చెందగలను. తాము సాధించిన పతకాలను వారు గంగ పాలు చేస్తామనడం గుండెలు పిండేసేదే’ అని హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ బుధవారం ట్వీట్ చేశారు. ఈ అంశం వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తినే ప్రమాదం ఉన్నదని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలిపినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వెల్లడించింది. రెజ్లర్ల అంశం కేంద్రానికి సంబంధించినదని రాష్ట్రం తటస్థంగా వ్యవహరిస్తున్నది.
ఫిర్యాదు వచ్చినప్పుడు పరిశీలించాలి: ప్రీతం
మహిళల రక్షణకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోనికి తీసుకొని పరిశీలించాలని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతం ముండే అన్నారు. ఒక ఎంపీగా కాకుండా, ఒక మహిళగా ఇలా అభిప్రాయపడుతున్నానన్నారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత అది సరైనదా కాదా అనే విషయాన్ని అధికారులు నిర్ణయించాలన్నారు. ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో స్వాగతించాల్సిన విషయం కాదన్నారు. అంతిమంగా రెజర్లకు న్యాయం జరుగుతుందని ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేడు రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం
రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు వారికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. గురువారం రెజ్లర్లకు మద్దుతుగా సంయుక్త కిసాన్ మోర్చా పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ధర్నాలు నిర్వహించింది. భారత రెజ్లింగ్ సమాఖ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలని కోరుతూ రైతులు పలు నగరాల్లోని కమిషనర్లు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లకు వినతి పత్రాలు సమర్పించారు. అమృత్సర్లో బ్రిజ్ భూషణ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. రెజ్లర్ల డిమాండ్లపై రాష్ట్రపతిని కలవాలని పంచాయత్లో నిర్ణయించినట్టు రైతు నేత నరేశ్ టికాయిత్ వెల్లడించారు. మీటింగ్ నుంచి టీఎంసీ ఎంపీలు వాకౌట్
రెజర్లు చేస్తున్న పోరాటం జీవితం కోసం, స్వాతంత్య్రం కోసమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గురువారం ఆమె కోల్కతా వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మరోవైపు యువత, మహిళలు, పిల్లలు, క్రీడలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో రెజ్లర్ల సమస్యను చర్చించనందుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ సుష్మిత దేవ్ వాకౌట్ చేశారు.
‘పోక్సో’ కేసుల్లో వెంటనే అరెస్ట్ చేయాలి కదా!
పోక్సో చట్టం కింద భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై కేసు నమోదై నెల రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో చట్టం ప్రకారం సాధారణంగా నేరం చేశారన్న ఊహ లేదా అంచనా ఉన్నప్పుడు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్ట్ అడ్వొకేట్ వికాస్ సింగ్ తెలిపారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో ఫిర్యాదు చేసిన మైనర్ వయస్సును ఇంకా నిర్ధారించాల్సి ఉన్నదని ఢిల్లీ పోలీసులు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసుల దర్యాప్తు నత్తనడకలా సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రిటిషర్లను తరిమేసినట్టు బీజేపీని తరిమేస్తారు
రెజ్లర్ల డిమాండ్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే బ్రిటిషర్లను తరిమేసినట్టు దేశ ప్రజలు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని తరిమేస్తారని మాజీ కోచ్, ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత మహవీర్ ఫోగట్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పల్లెల పంచాయత్లు మొదలుకొని అనేక సంఘాలు రెజ్లర్ల కోసం పోరాడుతున్నాయని ఆయన అన్నారు. కేంద్రం తీరుతో జూనియర్ రెజ్లర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదమున్నదన్నారు.