న్యూఢిల్లీ, ఆగస్టు 15: కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్ లలిత్ మాట్లాడుతూ ‘ఒక న్యాయమూర్తి తన తీర్పు, ఉత్తర్వుల ద్వారానే మాట్లాడుతారనే విషయాన్ని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.
జడ్జిలు ఇచ్చిన తీర్పులను న్యాయశాస్త్రంపై అవగాహన ఉన్నవారితో పాటు సామాన్యులు కూడా విమర్శించవచ్చు, విశ్లేషించవచ్చని పేర్కొన్నారు. ‘తీర్పుల విషయంలో ప్రతి ఒక్కరికీ వేర్వేలు అభిప్రాయాలు ఉంటాయని, అలా కాదు.. ఇలా అని వ్యాఖ్యానించొచ్చు’ అని అన్నారు. అంతకు ముందు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.