Crime news : మహారాష్ట్రలో డీసీపీ షిల్వంత్ నాందేడ్కర్ ఏకైక కుమారుడు సాహిల్ శిల్వంత్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఛత్రపతి సంభాజీనగర్లోని తమ ఇంట్లోనే పడకగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం వరకు స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపిన సాహిల్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటన వెనుకగల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సాహిల్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించనప్పటికీ, అద్దంపై ‘మళ్లీ జన్మిస్తా’ అని రాసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘ఈ జీవితాన్ని, శరీరాన్ని ఆస్వాదించాను. ఇక చాలు. నేను మళ్ళీ వస్తా.. వదిలి వెళ్లిపోవడం లేదు..’ అని సాహిల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన గదిలోని అద్దంపై రాశాడు. దీనిని బట్టి చూస్తే చనిపోతేనే మళ్లీ జన్మించవచ్చు అన్న నమ్మకంతోనే సాహిల్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనే మాటలు వినపడుతున్నాయి.
ఈ ఘటనపై వేదాంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాహిల్ చదువులోనూ ముందుండేవాడని వారి కుటుంబసభ్యులు, స్నేహితులు చెప్తున్నారు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ చేసిన సాహిల్.. చదువుకుంటానని చెప్పి బెడ్ రూంలోకి వెళ్లాడు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులు అతన్ని నిద్ర లేపే ప్రయత్నం చేయగా.. గది తలుపులు తీయలేదు. మరో తాళం సాయంతో గది తలుపులు తీసి చూడగా సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఉన్నాడు.