ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).. మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్గా నియమితుడయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్చ్ ముఖ్ అభియాన్ స్కీమ్లో భాగంగా సచిన్ను అంబాసిడర్గా నియమించారు. ఈ నేపథ్యంలో ఒప్పందం జరిగింది. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా స్వచ్చ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్లీన్ మౌత్ కాంపేయిన్ కోసం సచిన్ అయిదేళ్ల పాటు స్మైల్ అంబాసిడర్గా ఉంటాడు. రాష్ట్రంలో నోటి సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఈ కాంపేయిన్ చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దంతాల రక్షణ కోసం ఈ ప్రచారంలో భాగంగా అయిదు ఆరోగ్య సూత్రాలపై ఫోకస్ పెట్టనున్నారు. రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రం చేయడం, ఏదైనా తిన్నతర్వాత నీటితో నోటిని పుకులించడం, హెల్తీ డైట్ను తీసుకోవడం, టొబాకో ఉత్పత్తుల్ని మానివేయడం, రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేపట్టడంపై ప్రచారం చేయనున్నారు.