Khalistan | న్యూఢిల్లీ: కెనడాలో తమ ఎజెండాను అమలు చేసేందుకు ఆ దేశం కేంద్రంగా పనిచేసే ఖలీస్థాన్ అనుకూల శక్తులు పక్కా వ్యూహంతో పనిచేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇందులో భాగంగా సిక్కు యువతకు వీసాలను స్పాన్సర్ చేయడంతో పాటు ఉద్యోగాలను ఎరగా వేసి ఆకర్షించడం ద్వారా, వారిని తమ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలనేది ఖలిస్థానీల ముఖ్యమైన ప్లాన్ అని తెలిపాయి.
ఇటీవల హత్యకు గురైన ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్తోపాటు మోనిందర్ సింగ్, పర్మిందర్ పంగ్లి ఇతర వ్యక్తులు తమ ఖలిస్థాన్ అనుకూల ఎజెండాను అమలు చేసేందుకు సిక్కు యువతను ఉపయోగించుకొంటున్నారని పేర్కొన్నాయి. కెనడాలో ప్లంబర్, ట్రక్కు డ్రైవర్లు వంటి వాటితోపాటు గురుద్వారాల్లో పలు పనుల పేరుతో పంజాబ్ నుంచి సిక్కు యువతకు వీసాలను స్పాన్సర్ చేసి రప్పిస్తున్నాయని తెలిపాయి. అటువంటి వారిని కెనడాలో భారత్కు వ్యతిరేకంగా జరిపే కార్యక్రమాలు, ఆందోళనలు, ఖలిస్థాన్ కార్యకలాపాలకు వినియోగించుకొంటున్నారని వివరించాయి.
మాది ఆ విధానం కాదు: జయశంకర్
నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉన్నదని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. అది భారత ప్రభుత్వ విధానం కాదని ఇప్పటికే కెనడాకు స్పష్టం చేశామని తెలిపారు. బుధవారం న్యూయార్క్లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించిన అనంతరం ‘కౌన్సిల్ ఆఫ్ ఫారిల్ రిలేషన్స్’ చర్చాగోష్టి సందర్భంగా జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.