బెంగళూరు, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నదని కల్యాణ కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి తెలిపింది. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కల్యాణ కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. మంగళవారం కలబుర్గి నగరంలో కల్యాణ కర్ణాటక సమితి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ర్యాలీ నిర్వహించిన నిరసనకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నిచారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన ఎంఎన్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో పురోగతి సాధించి దేశానికే మార్గదర్శకంగా నిలిస్తున్నది. మా ప్రాంతం కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. మా ప్రాంతాభివృద్ధికి చట్టాన్ని చేసినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మాకు ప్రతి రంగంలోనూ అన్యాయం జరుగుతున్నది. ప్రత్యేక నిధులు కేటాయించి ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు. కేవలం నిధులే కాదు.. నియామకాల్లోనూ అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాల్సిందే’ అని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమ సత్తాను చాటుతామని పాటిల్ తెలిపారు.