Ganapathi | రాయపూర్, మే 28: ఈ నెల 21న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బసవరాజు గురువు, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశంలోకి తిరిగి వచ్చినట్లు బస్తర్లో జోరుగా వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. 2018లో పక్కకు తప్పుకుని బసవరాజుకు బాధ్యతలు అప్పగించడానికి ముందు దాదాపు 15 ఏళ్ల పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నారు. ‘అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి చికిత్స, విశ్రాంతి కోసం ఇన్నేళ్లు ఫిలిప్పీన్స్లో ఉన్నారు. ఎన్కౌంటర్లో బసవరాజు మరణించిన తర్వాత ఆయన దేశానికి తిరిగివచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సలహాదారుగా గణపతి ఉన్నారు.
70వ పడిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మావోయిస్టులకు అధిపతిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టలేరు’ అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. బస్తర్ డివిజన్లోని అడవుల నుంచి వినవస్తున్న సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన సీనియర్ కమాండర్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బసవరాజు వారసుడి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని, గుండెపోటుతో రామన్న మరణించిన తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా రామచంద్రా రెడ్డి ఎప్పుడు బాధ్యతలు తీసుకున్నారో అధికారికంగా ప్రకటించ లేదని వర్గాలు తెలిపాయి. బసవరాజు స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టినా ఆ వ్యక్తికి భూమ్మీద నూకలు కొద్దికాలమే ఉంటాయని, ఎన్కౌంటర్లో ఆ వ్యక్తిని భద్రతా దళాలు అంతం చేస్తాయని నక్సల్ వ్యతిరేక ఆపరేషన్కు చెందిన అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.
బసవరాజు స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఆ గ్రూపులో ఎవరూ లేరని, మిగిలి ఉన్న నాయకులకు రెండే దారులు ఉన్నాయని, లొంగిపోవడమో లేక ఎన్కౌంటర్లో చావడమో వారే తేల్చుకోవాలని బస్తర్ ఐజీ సుందర్రాజ్ స్పష్టం చేశారు. బసవరాజు, గణపతి తర్వాత ఆ స్థానానికి సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. జార్ఖండ్కు చెందిన మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్కి కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే మావోయిస్టు పార్టీలో తెలుగు వారి ప్రాబల్యం వల్ల ఇతరులకు నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.