(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)
గోవు తల్లితో సమానమంటూ అభివర్ణించిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని నగరాల వీధుల్లో అవే ఆవులు ఇప్పుడు తిండికి అలమటిస్తూ దిక్కులేక సంచరిస్తున్నాయి. కారణం.. గోసంరక్షణ కోసమంటూ అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆర్భాటంగా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఇంతకాలం గోవుల ఆలనాపాలన చూసిన గోసేవా సంఘ్ సభ్యులు, ఇతర ట్రస్టుల ప్రతినిధులు, షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు నష్టాలు భరించలేక.. వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసులు, కోర్టు ప్రాంగణాల్లో ఆవులను విడిచిపెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హామీని గాలికొదిలేశారు
‘మేము గోభక్తులం. గోవుల సంరక్షణకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాం’ అని గత మార్చిలో సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటిస్తూ ‘ముఖ్యమంత్రి గోమాత పోషణ్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. గోవుల కోసం షెడ్లు నిర్మించి, వాటి ఆలనాపాలన చూసే గోసేవా సమితులు, ట్రస్టులకు ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలు ట్రస్టులు నమోదు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఆవుల సంరక్షణ బాధ్యత చేపట్టాయి. అయితే, ఆరు నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ట్రస్టులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించాలంటూ నిర్వాహకులు, ట్రస్టు సభ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో పెరిగిన ధరలతో ఆవులను పోషించలేమంటూ గతవారం పలు ట్రస్టుల సభ్యులు, షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆవులను విడిచిపెట్టి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వెంటనే బకాయిలు చెల్లించాలని పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 1 నుంచి ‘గోరథ్ యాత్ర’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతామని గుజరాత్ గోసేవా సంఘ్ ప్రకటించింది. వచ్చే ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతీఒక్కరితో ప్రమాణం చేయిస్తామని హెచ్చరించింది.
దారుణంగా మోసం చేశారు
మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. సీఎం సహా మంత్రులందరూ ప్రమాణం చేసి మాట తప్పారు. ‘గో సంరక్షణకు ప్రభుత్వం నిధులు కేటాయించింది కదా..’ అంటూ కొందరు విరాళాలు ఇవ్వడం మానేశారు. ఈ నెల 30 నాటికి నిధులు విడుదల చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయం. అసలు పోలింగ్లోనే పాల్గొనబోం.
– విపుల్ మాలి, గుజరాత్ గోసేవా సంఘ్ ప్రధాన కార్యదర్శి
‘గోమాత మనకు మాతృ సమానురాలు. పూజనీయురాలు. దేశానికి గర్వకారణమైన పశుసంపద మీద ఆధారపడి కోట్లాది మంది జీవనం సాగిస్తున్నారు. అలాంటి గోవులను మనం రక్షించుకోవాలి’
– 2021 డిసెంబర్ 23న వారణాసి సభలో ప్రధాని మోదీ