చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి తాజాగా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడంటూ మెసేజ్ వచ్చింది. ఇది చూసిన మృతుడి కుటుంబం బిత్తరపోయింది. ఆ తర్వాత ఇలా మరణించిన వారికి కూడా వ్యాక్సిన్ వేసినట్లు చూపించి వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరిగినట్లు అధికారులు అబద్ధాలు చెప్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేసింది.
ఇదే విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తమిళనాడులోని త్రిచీలో జరిగింది. సెల్వరాజ్ గోవిందచెట్టియార్ అనే వక్తి ఈ ఏడాది ఏప్రిల్ 28న తొలి డోసు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ అతనికి కరోనా సోకింది. చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. కరోనాతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత తాజాగా ఆ కుటుంబానికి చెందిన మొబైల్కు ఒక మెసేజ్ వచ్చింది. దానిలో త్రిచిలో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్లో సెల్వరాజ్ తన రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఉంది. కొవిన్ యాప్లో వచ్చిన ఈ మెసేజ్ చూసిన ఆ కుటుంబం షాకైపోయింది. ఇలా మరణించిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయితే యాప్లో మొబైల్ నెంబర్ అప్లోడ్ చేసే సమయంలో ఉద్యోగి చేసిన చిన్న తప్పు కారణంగా ఇలా జరిగిందని, అంతేకానీ వ్యాక్సినేషన్ విషయంలో అబద్ధాలు చెప్పాలనే యోచన ఎవరికీ లేదని అధికారులు స్పష్టం చేశారు.