కోల్కతా, మే 21: వచ్చే వారం జరిగే ఈద్ అల్-అధాను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడలు, గేదెల వధపై పరిమితులు విధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కలకత్తా హైకోర్టు గురువారం తిరస్కరించింది. గోవు బలి అనేది ఇస్లాంలో ఒక ఆవశ్యకత మత ఆచారం కాదని స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిజానికి మే13న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ 2018లో కోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమేనని చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాల్సిన, పక్కన పెట్టాల్సిన పరిస్థితి తమకు కన్పించడం లేదని పేర్కొంటూ, దానిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా, వచ్చే వారం జరిగే బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో విచ్చలవిడిగా పశువధ జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం జంతుబలి చట్టం కింద ఈ నెల 13న దానిపై పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం అన్ఫిట్ అన్న ధ్రువీకరణ పత్రం లేని ఏ జంతువును కూడా వధించ రాదు.