Karnataka | దావణగెరె (కర్ణాటక) : తమ యజమాని ప్రాణాలు కాపాడటం కోసం ఓ ఆవు, ఓ కుక్క క్రూరమృగమైన చిరుతతో తలపడ్డాయి. తమకు అన్నం పెట్టిన రైతు ప్రాణాలు కాపాడి రుణం తీర్చుకున్నాయి. ఓ గోవు, ఓ కుక్క చిరుతపులిని తరిమికొట్టాయి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో కరిహలప్ప (58) అనే రైతు తన ఆవును తీసుకుని పొలానికి వెళ్లాడు. పొదలో దాగి ఉన్న చిరుత హఠాత్తుగా కరిహలప్పపై దాడికి ప్రయత్నించింది. ఇది చూసిన ఆవు వెంటనే అక్కడకు వచ్చి తన కొమ్ములతో చిరుతపై దాడికి దిగింది. అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడింది. అదే సమయంలో కుక్క కూడా దాడికి దిగడంతో చిరుతపులి బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఆవు, కుక్క సమయానికి రాకపోతే ప్రాణాలు దక్కేవి కాదంటూ కరిహలప్ప ఉద్వేగంతో చెప్పాడు.