లక్నో: ఒక ఆవు ముఖ్య అతిథిగా వచ్చి ఆర్గానిక్ రెస్టారెంట్ (Organic Restaurant) ను ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ ‘ఆర్గానిక్ ఒయాసిస్’ పేరుతో ఒక రెస్టారెంట్ను ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని ఇక్కడ సర్వ్ చేస్తారు. అయితే ఆర్గానిక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఒక ఆవును తీసుకొచ్చారు. దానితోనే సేంద్రీయ రెస్టారెంట్ను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆ ఆవుపై పచ్చని వస్త్రం కప్పారు. దానికి సేంద్రీయ ఆహారం తినిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవులపై ఆధారపడి ఉన్నాయని ‘ఆర్గానిక్ ఒయాసిస్’ రెస్టారెంట్ మేనేజర్, మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ అన్నారు. అందుకే తమ ఆర్గానిక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా గోమాతను ఎంచుకున్నట్లు చెప్పారు. సాధారణంగా జనమంతా ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించిన వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా పొందుతున్నారని తెలిపారు. దేశంలో సొంతంగా ఏర్పాటు చేసిన సేంద్రీయ ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్ సెంటర్ ఉన్న మొదటి రెస్టారెంట్ తమదేనని అన్నారు. ఈ ఆహారం తీసుకున్న తర్వాత, ఇతర ఆహారాల మధ్య తేడాను కస్టమర్లు గమనిస్తారని, ఆ తర్వాత సేంద్రీయ ఫుడ్ను మరింతగా డిమాండ్ చేస్తారని ఆయన వెల్లడించారు.
#WATCH | Uttar Pradesh: A restaurant in Lucknow, 'Organic Oasis' that offers food made out of organic farming produce, was inaugurated by a cow. pic.twitter.com/YWcfKqJQcX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 18, 2023