అల్వార్: రైలు పట్టాల వెంబడి ఓ పశువుల మంద మేస్తున్నది. అదే సమయంలో ఓ వృద్ధుడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి మూత్ర విసర్జన చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వందే భారత్ రైలు కూతపెడుతూ అటుగా వస్తున్నది. ఇది గమనించని ఓ ఆవు పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నది. మరణించిన వృద్ధుడు శివదయాల్ శర్మ (82) గా పోలీసులు గుర్తించారు. రైలు ఢీకొట్టగానే మరణించిన ఆవు ఎగిరి వృద్ధుడిపై పడటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే అల్వార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆవు ట్రాక్పైకి రావడం, వృద్ధుడు అక్కడికే మూత్ర విసర్జన కోసం రావడం, అప్పుడే రైలు దూసుకొచ్చి ఆవును ఢీకొట్టడం, అది ఎగిరి వృద్ధుడిపై పడటం అంతా ఓ మాయలా జరిగిపోయింది. అందుకేనేమో మృత్యువు ఎటు నుంచి ఏ రూపంలో ముంచుకొస్తుండే ఎవరూ ఊహించలేరంటారు.