డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో 2023-24కు సంబంధించిన నూతన ఎక్సైజ్ పాలసీకి అక్కడి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇవాళ క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, ఎక్సైజ్ సెక్రెటరీ హరిచంద్ర సెమ్వాల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్లోకి మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ సర్కారు ఈ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది.
ఉత్తరప్రదేశ్తో పోల్చితే ఉత్తరాఖండ్లో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో బాటిల్పైన రూ.150 మొదలు రూ.200 వరకు వ్యత్యాసం ఉంది. దాంతో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్లోకి భారీగా మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ లిక్కర్ స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో కీలక మార్పు చేసింది. యూపీతో పోల్చితే మద్యం ధరల వ్యత్యాసాన్ని ఒక్కో బాటిల్పై రూ.20కి తగ్గించింది.
అదేవిధంగా ఉత్తరాఖండ్ నూతన మద్యం పాలసీతో ప్రభుత్వ రెవెన్యూను పెంచే మరో నియమాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి బాటిల్పై ఒక్క రూపాయి చొప్పున ఆవు పన్ను, క్రీడా పన్ను, మహిళ సంక్షేమ పన్నును విధించారు. అంటే మద్యం ప్రియులు ఈ మూడు పన్నులకు కలిపి ఒక్కో బాటిల్ ధరపై అదనంగా రూ.3 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఎక్సైజ్ రెవెన్యూ లక్ష్యాన్ని ఉత్తరాఖండ్ సర్కారు రూ.4 వేల కోట్లుగా నిర్దేశించుకుంది.