న్యూఢిల్లీ : భారత్లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కాదని సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పునావాలా అన్నారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కోవోవాక్స్ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు.
కోవోవాక్స్తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం మా విధానమన్నారు. కోవోవాక్స్ వ్యాక్సిన్ స్టాక్ భారీగానే ఉందని, డ్రగ్ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత భారత్తో పాటు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు. అమెరికాలో నోవోవాక్స్ పేరిట పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ సీరం సంస్థ కోవోవాక్స్తో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల జారీలో జాప్యం జరుగుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా కోవోవ్యాక్స్ ప్రయాణ ప్రయోజనాల అనుమతి పొందనందున భారతీయులు ప్రస్తుతానికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. భారత్లో ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించి జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్-డీ టీకా మాత్రమే అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి పొందింది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు సైతం అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫారసు చేసింది.
అయితే, ఇటీవల అత్యవసర వినియోగానికి కోవోవాక్స్ దరఖాస్తు చేయగా.. నిపుణుల కమిటీ మరింత సమాచారాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ టీకా సైతం అందుబాటులోకి వస్తే పిల్లలకు అందుబాటులోకి వచ్చిన మూడో వ్యాక్సిన్గా నిలువనున్నది.