న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం తప్పనిసరని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ రక్షణ ఎక్కువకాలం ఉండదని, కాబట్టి బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదని ఢిల్లీలోని ఐఎల్బీఎస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరీన్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోస్ తప్పనిసరి అన్నది నా అభిప్రాయం. మనం ఏదైనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పుడు దాని ప్రభావం మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గిపోతుంది. అందువల్ల థర్డ్ డోస్ లేదా బూస్టర్ డోస్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే, ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం తగ్గుతుంది అని సరీన్ చెప్పారు.
దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో బూస్టర్ డోస్ గురించి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు.. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుందని భావిస్తున్నా అని సరీన్ అభిప్రాయపడ్డారు. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 6,317 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 318 మరణాలు సంభవించాయి.