హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు పంపిణీ అవుతున్నాయి. నేటి వరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా వేసుకున్న వారి మొత్తం సంఖ్య 11,11,79,578గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ వెల్లడించింది. కోవిడ్ నియంత్రణ కోసం కోవిడ్ టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ నుంచి టీకా ఉత్సవ్ నిర్వహిస్తున్నది. ఇవాళ టీకా ఉత్సవ్లో నాలుగవ రోజు. గత 24 గంటల్లో దేశంలో 26 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలను ఇండియాలో ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇండియాలో వ్యాక్సినేషన్ కోసం అనుమతి పొందిన తొలి విదేశీ టీకా అదే కావడం గమనార్హం.